ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తర్వాతి ప్రాజెక్టు ‘RRR’ (వర్కింగ్ టైటిల్) విశేషాల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య సినిమాను నిర్మించనున్నారు. సెంథిల్ సినిమా కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఆయన ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘మహానటి’ వంటి సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ రాశారు. ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారని, త్వరలో షూటింగ్ ఆరంభం కాబోతోందని గత కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే దీనిపై తాజాగా రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. నవంబరు 11న ఉదయం 11 గంటలకు సినిమాను ఆరంభిస్తున్నట్లు తెలుపుతూ.. వీడియోను విడుదల చేశారు. దీంతో యూట్యూబ్లో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. అందులో ఓ కథానాయికగా విదేశీ భామని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురూ ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారట. సమంత, కీర్తి సురేశ్, రష్మికలను ఈ సినిమా కోసం అనుకున్నట్లు గతంలో గుసగుసలు వచ్చాయి. అంతేకాదు.. సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని కూడా వెల్లడిస్తారని సమాచారం.ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇందులో వీరు అన్నదమ్ములుగా కనిపించనున్నట్లు తెలిసింది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత జక్కన్న తెరకెక్కించబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

0 Comments