New Hunter: కేంద్రప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన సంకేతాలకు తగ్గట్లుగానే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో భేటీ అయిన జీఎస్టీ మండలి దాదాపు 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది. ఇందులో 7 వస్తువలుపై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి, మిగతా 26 వస్తువులపై ఉన్న 18 జీఎస్టీ శాతాన్ని 12కు,5కు తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ 33 వస్తువులే కాకుండా, మిగతా వస్తువులపై కూడా త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇకపై విలాసవంతమైన వస్తువులు మాత్రమే జీఎస్టీ 28 శాతం పన్ను పరిధిలో ఉంటాయని తెలిపారు.
మానిటర్లు, టెలివిజన్ స్క్రీన్స్, టైర్లు, లిథియం-అయాన్ బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంకులపై పన్ను తగ్గుతుంది. వీటిని 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చినట్లు జైట్లీ తెలిపారు. దివ్యాంగుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాలకు ఉపయోగించే విడి భాగాలపై పన్నును 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
సినిమా టిక్కెట్ల ధరను బట్టి పన్ను తగ్గించారు. టికెట్ ధర రూ.100 వరకు ఉంటే 12 శాతం జీఎస్టీ విధిస్తారని, టికెట్ ధర రూ.100కుపైగా ఉంటే పన్ను 18 శాతం విధిస్తారని జైట్లీ తెలిపారు. ఈ పన్ను ఇప్పటి వరకు 28 శాతం ఉండేదన్నారు.
రియల్ ఎస్టేట్పై జీఎస్టీ గురించి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ చెప్పారు. మొత్తం మీద శనివారం జరిగిన జీఎస్టీ మండలి నిర్ణయాల ప్రకారం 33 వస్తువులపై పన్ను తగ్గింది. సామాన్యులు వినియోగించే వస్తువులపై 18 శాతం నుంచి 12 శాతం, 5 శాతం పన్నును మాత్రమే విధించాలని నిర్ణయించారు.
