News Hunter : పూర్తి భద్రత, రక్షణ కల్పిస్తామంటూ నమ్మబలికి అమ్మాయిలకు హాస్టల్ ఇచ్చిన వ్యక్తి తర్వాత తన దుర్మార్గాన్ని బయటపెట్టాడు. యువతులు ఉంటున్న గదుల్లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి వారి కదలికలను గమనిస్తూ ఉన్నాడు. రహస్య కెమెరాను గమనించిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు హాస్టల్ యజమాని చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు.
తమిళనాడులోని చెన్నైకి చెందిన 48ఏళ్ల సంపత్ రాజ్ అలియాస్ సంజయ్ అడంబాక్కంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా హాస్టల్ను ఏర్పాటు చేశాడు. ఇందులో ఉండాలంటే ఒక్కొక్కరు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ అడ్వాన్స్ కింద రూ.20,000 చెల్లించాల్సి ఉంది. యువతులు ఉండే గదులు, బాత్రూంలలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి వారి కదలికలను గమనించేవాడు. ఒక రోజు ఓ యువతి బాత్రూంలో హెయిర్ డ్రయిర్ ప్లగ్బోర్డులో పెట్టేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అందులో ఏముందా అని పరిశీలించగా చిన్న కెమెరా ఉండటాన్ని గనమించింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ హాస్టల్ను నిశితంగా పరిశీలించగా తొమ్మిది రహస్య కెమెరాలు లభించాయి.
ప్లగ్సాకెట్స్లో మూడు, ల్యాంప్ బల్బుల్లో రెండు, చేతి గడియారాల్లో మూడు, దుస్తులు తగిలించుకునే హ్యాంగర్లో ఒక కెమెరా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. సంపత్ రాజ్ దగ్గర నుంచి మూడు ల్యాప్ట్యాప్లు, రెండు ట్యాబ్స్, 10 మొబైల్ ఫోన్స్, ఒక హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ను తనిఖీ చేసే సాకుతో యజమాని సంపత్ చాలా సార్లు అక్కడికి వచ్చేవాడని యువతులు చెప్పారు. ఎక్కడ కెమెరాలు పెడితే యువతులు కనిపిస్తారో పరిశీలించి వాటి ప్రదేశాలు మారుస్తూ ఉండేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

0 Comments