News Hunter : సాఫ్ట్వేర్ ఇంజినీర్ను తన స్నేహితుడే దారుణంగా కొట్టి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్, హేమంత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భాగస్వాములు. ఈ నేపథ్యంలో మూసాపేట్కు చెందిన సతీశ్ అదృశ్యమైనట్లు ఈ నెల 28న కేపీహెచ్పీ పోలీసుస్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు వెతికే క్రమంలో కేపీహెచ్బీ 7వ ఫేజ్లో హేమంత్ ఉంటున్న గదిని సతీశ్ భార్య వారికి చూపించింది. పోలీసులు, సతీశ్ భార్య అక్కడికి వెళ్లి పరిశీలించి గదికి తాళాలు వేసి ఉన్నట్లు గమనించారు. అనుమానించిన పోలీసులు తలుపులు పగులగొట్టి చూసేసరికి సతీశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ విషయమై సీఐ లక్ష్మీనారాయణను వివరణ కోరగా సతీశ్ను తన మిత్రుడు హేమంతే కొట్టి చంపినట్లు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది.
