ఇస్రో : సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ రోదసిలోకి తీసుకువెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. శ్రీహరికోట షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ను నింగిలోకి పంపారు శాస్త్ర వేత్తలు. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని వదిలిపెట్టింది రాకెట్. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ ఉపగ్రహం.. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.

0 Comments